అసలు విషయాన్నిపెద్దలు చెప్పిన ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను... ఒక డాంబికయోగి కొందరు సాధకులున్న ఆశ్రమానికి వచ్చాడు. ఇతగాడి వేషం చూసి స్వచ్ఛమనస్కులైన ఆ సాధకులు స్వాగతం పలికారు. వీరి ద్వారా స్వప్రయోజనం నెరవేర్చుకోదలచాడు డాంబికయోగి. తాను సాధన దశలన్నీ దాటేసి పండిపోయినట్లు బడాయి మాటలు చెప్పి, ఆ రాత్రి వారి ఆశ్రమంలో విడిది చేస్తాననీ, ఈ అవకాశం సద్వినియోగం చేసికొని తరించటానికి వారు తనకు మృష్టాన్నభోజనం పెట్టాలనీ అన్నాడు. "ఇంతకంటే అదృష్టమా!" అనుకున్నారు అమాయిక సాధకులు. రోజూ తాము గంజినీళ్ళే తాగుతున్నా ఈ మహాయోగికి మాత్రం షడ్రసోపేతమైన విందు చేయాలనుకున్నారు. "మీరీ అవకాశం ఇవ్వటం మా సుకృతం స్వామీ! మరి రాత్రి భోజనానికి ఏం సిద్ధంచేయమంటారు?" అని అడిగారు. చాలా రోజులుగా మంచి భోజనానికి మొహంవాచి ఉన్న తనకు ఏంకావాలో అడిగి మరీ పెట్టేవాళ్ళు దొరికారని లోలోపల మురిసిపోతూ ఆ దంభయోగి "సమృద్ధిగా బూరెలూ, స్వచ్ఛమైన నెయ్యీ ఏర్పాటు చేయండి" అని తన కోరికను వెల్లడించాడు. ఈ ఖరీదైన కోరిక సాధకులను కలవరపరచింది. వారిలో ఒకనికి "ఇదేమిటీ యోగికి ఇంతటి జిహ్వాచాపల్యం!" అనే అనుమానం రానే వచ్చింది. అయినా భోజనం ఏర్పాటుచేస్తామని మాట ఇచ్చారు కనుక మారు మాట్లాడకుండా భోజనసామగ్రి సమకూర్చుకోవటం ఎలాగురా భగవంతుడా అని లోలోపల భయపడుతూ, దంభయోగితో "అలాగే స్వామీ ! మీ ఆజ్ఞ అన్నీ సమకూరుస్తాం.మేము తిరిగి వచ్చేలోగా మీరు... అదుగో... కనిపిస్తున్న ఆ వాగులో స్నానం చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకోండి" అన్నారు. ఈమాటకు దంభయోగి చర్రున లేచాడు. "ఏమిటీ! నేను స్నానం చేయటమా ?" అన్నాడు. "అదేమిటి స్వామీ! మీరు స్నానం చేయరా ?" అన్నాడొక సాధకుడు.
|
|